Logo
Date of Publish : 19 April 2024, 7:26 pm
Editor : Sake Naresh

చివరి శ్వాస వరకు బీజేపీ జెండా కోసమే పని చేస్తా… పార్టీయే నాకు ఊపిరి: నామినేషన్ వేసిన తర్వాత కిషన్ రెడ్డి

  • సికింద్రాబాద్ నుంచి తనకు మరోసారి అవకాశమివ్వాలని విజ్ఞప్తి
  • తెలంగాణలో అన్ని పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా
  • కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శ

బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావన్న కిషన్  రెడ్డి

తన చివరి శ్వాస వరకు బీజేపీ జెండా కోసమే పని చేస్తానని... పార్టీయే తన ఊపిరి అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సికింద్రాబాద్ నుంచి తనకు మరోసారి అవకాశమివ్వాలని కోరారు.

తెలంగాణలో అన్ని పార్టీల కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందన్నారు. బీఆర్ఎస్‌కు కనీసం డిపాజిట్లు రావన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

నామినేషన్ దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు

ఈరోజు పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి మజ్లిస్ అభ్యర్థిగా అసదుద్దీన్ ఒవైసీ, నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, భువనగిరి సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్, భువనగిరి బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies